క్రెటేషస్-పాలియోజీన్ విలుప్తి ఘటన
From Wikipedia, the free encyclopedia
క్రెటేషియస్-పాలియోజీన్ (K-Pg) విలుప్తి ఘటన [lower-alpha 1] అనేది, సుమారు 6.6 కోట్ల సంవత్సరాల కిందట [1] భూమ్మీద నాలుగింట మూడు వంతుల వృక్ష, జంతు జాతులు మూకుమ్మడిగా నశించిపోయిన సంఘటన. [2] [1] [3] దీన్ని క్రెటేషియస్-టెర్షియరీ (K–T) విలుప్తి అని కూడా పిలుస్తారు [lower-alpha 2] ఈ ఘటన లోనే నేలపై నివసించే డైనోసార్లు అంతరించిపోయాయి. అంతేకాదు, సముద్ర తాబేళ్లు, మొసళ్ళ వంటి కొన్ని ఎక్టోథర్మిక్ జాతులు మినహా, 25 కిలోలకు పైబడి బరువున్న టెట్రాపోడ్స్ ఏవీ బతకలేదు. [5] ఈ ఘటనతో క్రెటేషియస్ పీరియడ్ ముగిసింది. దానితో పాటే మెసోజాయిక్ ఎరా ముగిసి, సెనోజాయిక్ ఎరా మొదలైంది. ప్రస్తుతం జరుగుతున్నది సెనోజోయిక్ ఎరాయే.
భౌగోళిక రికార్డులో K -Pg ఘటనను, K -Pg సరిహద్దు అని పిలిచే పలుచని అవక్షేప పొర ద్వారా గుర్తించవచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా సముద్ర శిలలు, భూ శిలలు రెండింటి లోనూ కనిపిస్తుంది. ఈ సరిహద్దు పొర వద్ద ఉన్న బంకమట్టి సమ్మేళనంలో ఇరిడియం లోహం స్థాయి అసాధారణంగా ఎక్కువగా ఉంది. ఈ లోహం భూమి పైపెంకులో ఇంత స్థాయిలో ఎక్కడా ఉండదు. భూమిపై కంటే గ్రహశకలాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. [6]
1980 లో [7] లూయిస్ అల్వారెజ్, అతని కుమారుడు వాల్టర్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ప్రతిపాదించినట్లుగా, K -Pg విలుప్తికి కారణం 6.6 కోట్ల సంవత్సరాల క్రితం [1] 10 నుండి 15 కి.మీ. వెడల్పున్న భారీ తోకచుక్క లేదా గ్రహశకలం భూమిని గుద్దుకోవడమేనని ఇప్పుడు విస్తృతంగా భావిస్తున్నారు. [8] [9] దీని వలన ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం నాశనమైంది. ఈ గుద్దుడు వలన ఏర్పడిన కృత్రిమ శీతాకాలం సూర్యరశ్మిని అడ్డుకోవడంతో మొక్కల్లోను, పాచి లోనూ కిరణజన్యు సంయోగ క్రియ ఆగిపోయింది. [10] [11] అల్వారెజ్ పరికల్పన అని పిలిచే ఈ పరికల్పనకు, 1990 ల ప్రారంభంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో లోని యుకాటాన్ ద్వీపకల్పంలో 180 కి.మీ. వ్యాసమున్న చిక్సులూబ్ బిలాన్ని కనుక్కోవడంతో బలం చేకూరింది. [12] దీనితో K -Pg సరిహద్దులో ఉన్న బంకమట్టి, గ్రహశకలం గుద్దుకోవడంతో ఏర్పడిన శిధిలాలేలని నిర్ధారించుకునే ఆధారాలు లభించాయి. [13] విలుప్తిలన్నీ ఏకకాలంలో సంభవించాయనే వాస్తవం, అవన్నీ గ్రహశకలం వల్లనే సంభవించాయని చెప్పేందుకు ఆధారంగా నిలుస్తోంది. [14] చిక్సులూబ్ లోకి 2016 లో చిక్సులూబ్ పీక్ రింగ్ లోకి చేసిన డ్రిల్లింగులో, గుద్దుడు తరువాతి నిమిషాల్లో భూమి లోతుల నుండి ఉబికి వచ్చిన గ్రానైటు ఆ పీక్ రింగులో కనబడింది. కానీ ఆ ప్రాంతపు సముద్ర గర్భంలోళ్ ఉండే జిప్సం మాత్రం కనబడలేదు. బహుశా తాకిడిలో జనించిన వేడి కారణంగా జిప్సం అవిరై వాతావరణంలోకి ఏరోసోల్గా చెదిరిపోయి ఉంటుంది. ఇది వాతావరణం పైన, ఆహార గొలుసుపైనా దీర్ఘకాలిక ప్రభావాలు కలిగించి ఉంటుంది. ఈ సంఘటన మహాసముద్రాలను వేగంగా ఆమ్లీకృతం చేసి, పర్యావరణ పతనానికి కారణమైందనీ, ఈ విధంగా అది వాతావరణంపై దీర్ఘకాలిక ప్రభావాలను కలగజేసిందనీ, క్రెటేషియస్ చివరిలో జరిగిన సామూహిక విలుప్తికి అది కూడా ఒక కీలక కారణమనీ 2019 అక్టోబరులో పరిశోధకులు చెప్పారు. [15] [16] 2020 జనవరిలో శాస్త్రవేత్తలు, విలుప్తి ఘటన చుట్టూ చేసిన వాతావరణ-మోడలింగు, గ్రహశకలం గుద్దుకున్న పరికల్పనకే మొగ్గు చూపింది తప్ప, అగ్నిపర్వతం పేలుడును సూచించలేదు. [17] [18] [19]
K-Pg విలుప్తిలో అనేక రకాల జీవజాతులు నశించాయి. వాటిలో బాగా తెలిసినవి ఎగరని డైనోసార్లు. ఈ ఘటనలో కొన్ని క్షీరదాలు, పక్షులు, [20] బల్లులు, [21] కీటకాలు, [22] [23] మొక్కలు, టెరోసార్లతో సహా అనేక ఇతర నేల జీవులు నశించిపోయాయి. [24] ఈ ఘటనలో మహాసముద్రాలలో ఉండే ప్లెసియోసార్లు, మోసాసార్లు, టెలియోస్ట్ చేపలు, [25] సొరచేపలు, మోలస్క్లు (ముఖ్యంగా అమ్మోనైట్లు), అనేక రకాల పాచి అంతరించిపోయాయి. ఈ K-Pg విలుప్తి ఘటనలో భూమిపై ఉన్న జీవజాతు లన్నిటిలో 75% లేదా అంతకంటే ఎక్కువ అదృశ్యమైనట్లు అంచనా వేసారు. [26] అయితే విలుప్తి వలన జీవ పరిణామానికి కొత్త అవకాశాలు కలిగాయి: దాని పర్యవసానంగా, అనేక సమూహాలు అసాధారణమైన సానుకూల విస్తరణకు లోనయ్యాయి - విలుప్తి వలన ఆకస్మికంగా ఖాళీ అయిన పర్యావరణ సముదాయాలలోని కొత్త రూపాల్లో, కొత్త జాతులు సమృద్ధిగా విస్తరించాయి. ముఖ్యంగా క్షీరదాలు పాలియోజీన్లో విస్తరించాయి. [27] గుర్రాలు, తిమింగలాలు, గబ్బిలాలు, ప్రైమేట్స్ వంటి కొత్త రూపాలు అభివృద్ధి చెందాయి. డైనోసార్ల సమూహంలో జీవించి ఉన్న ఎగిరే డైనోసార్లు, నేల కోడి, నీటి కోడి మొదలైనవి ఆధునిక పక్షి జాతులలోకి పరిణామం చెందాయి. [28] టెలియోస్ట్ చేప, [29] బహుశా బల్లులు [30] కూడా పరిణామం చెందాయి.