17 వ శతాబ్దం
శతాబ్దం / From Wikipedia, the free encyclopedia
17వ శతాబ్దం 1601 జనవరి 1 నుండి 1700 డిసెంబరు 31 వరకు కొనసాగింది. ఇది ఐరోపాలో ఆధునిక కాలపు తొలినాళ్ళు. ఆ ఖండంలో (ప్రపంచంపై దీని ప్రభావం పెరుగుతోంది) బరోక్ సాంస్కృతిక ఉద్యమం, స్పానిష్ స్వర్ణయుగపు చివరి భాగం, డచ్ స్వర్ణయుగం, ఫ్రెంచ్ గ్రాండ్ సైకిల్ లూయిస్ XIV, సైంటిఫిక్ రివల్యూషన్, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ (ప్రపంచంలోని మొట్టమొదటి పబ్లిక్ కంపెనీ, మెగాకార్పొరేషన్) వంటి చారిత్రిక ఘటనలను చూసిన శతాబ్దం ఇది.
17వ శతాబ్దం మధ్యకాలం నుండి, యూరోపియన్ రాజకీయాలను లూయిస్ XIV పాలన లోని ఫ్రాన్స్ రాజ్యం ఎక్కువగా ఆధిపత్యం చెలాయించింది. ఇక్కడ ఫ్రొండే అంతర్యుద్ధంలో దేశీయంగా రాజరికం పటిష్ఠమైంది. పాక్షిక భూస్వామ్య ప్రాదేశిక ఫ్రెంచ్ ప్రభువులు బలహీనపడి, సంపూర్ణ రాచరికపు అధికారానికి లొంగిపోయింది. ఈ శతాబ్దంలోనే ఆంగ్ల చక్రవర్తి నామమాత్రపు నేతగా మారాడు. ప్రభుత్వంలో పార్లమెంటు ప్రబలమైన శక్తిగా ఉంది - మిగతా ఐరోపా కంటే భిన్నంగా, మరీ ముఖ్యంగా ఫ్రాన్స్కు భిన్నంగా.
శతాబ్దం చివరి నాటికి, యూరోపియన్లు సంవర్గమానాలు, విద్యుత్, టెలిస్కోప్, మైక్రోస్కోప్, కాలిక్యులస్, సార్వత్రిక గురుత్వాకర్షణ, న్యూటన్ చలన నియమాలు, వాయు పీడనం, గణన యంత్రాల గురించి తెలుసుకున్నారు. శాస్త్రీయ విప్లవం యొక్క మొదటి శాస్త్రవేత్తలైన గెలీలియో గెలీలీ, జోహన్నెస్ కెప్లర్, రెనే డెస్కార్టెస్, పియరీ ఫెర్మాట్, బ్లేజ్ పాస్కల్, రాబర్ట్ బాయిల్, క్రిస్టియాన్ హ్యూజెన్స్, ఆంటోనీ వాన్ లీవెన్హోక్, రాబర్ట్ హుక్, ఐజాక్ న్యూటన్, గాట్ఫ్రైడ్ విల్హెల్మ్ వంటి వారి కృషి కారణంగా ఇది సాధ్యమైంది. ఇది సాధారణంగా సంస్కృతి అభివృద్ధి చెందిన కాలం (ముఖ్యంగా థియేటర్, సంగీతం, దృశ్య కళలు తత్వశాస్త్రం).
ఇస్లామిక్ ప్రపంచంలో, గన్పౌడర్ సామ్రాజ్యాలు - ఒట్టోమన్, సఫావిడ్, మొఘల్ సామ్రాజ్యాలు - బలపడ్డాయి. ముఖ్యంగా భారత ఉపఖండంలో, మొఘల్ వాస్తుశిల్పం, సంస్కృతి, కళలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. ఔరంగజేబు చక్రవర్తి పాలనలో ఈ సామ్రాజ్య ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దదని భావిస్తారు. ఇది మొత్తం పశ్చిమ ఐరోపా కంటే పెద్దది, ప్రపంచ GDP లో 25%. దాని లోని అత్యంత సంపన్న రాష్ట్రమైన బెంగాల్ సుబాలో తొలి-పారిశ్రామికీకరణ కాలపు సూచనలు కనిపించాయి.[1] భారతదేశపు దక్షిణ భాగంలో దక్కన్ సుల్తానేట్ల క్షీణత, విజయనగర సామ్రాజ్యం అంతరించిపోవడం జరిగింది. డచ్ వారు సిలోన్ను వలసరాజ్యంగా చేసుకున్నారు. క్యాండీతో శత్రుత్వాన్ని కొనసాగించారు.
శతాబ్ది ప్రారంభంలో జపాన్లో, టోకుగావా ఇయాసు టోకుగావా షోగునేట్ను స్థాపించాడు. దీంతో ఎడో కాలం ప్రారంభమైంది; ఐసోలేషనిస్ట్ సకోకు విధానం 1630లలో ప్రారంభమై, 19వ శతాబ్దం వరకు కొనసాగింది. చైనాలో, కుప్పకూలుతున్న మింగ్ రాజవంశాన్ని మంచూ యుద్దవీరుడు నూర్హాసి సవాలు చేసి, పలు విజయాలు సాధించాడు. అతని కుమారుడు హాంగ్ తైజీ ఈ విజయాలను స్థిరపరచాడు. చివరకు అతని మనవడు, క్వింగ్ రాజవంశం స్థాపకుడూ ఐన షుంజి చక్రవర్తి పూర్తి చేసాడు.
ముప్పై సంవత్సరాల యుద్ధం,[2] డచ్-పోర్చుగీస్ యుద్ధం, గ్రేట్ టర్కిష్ యుద్ధం, తొమ్మిదేళ్ల యుద్ధం, మొఘల్-సఫావిడ్ యుద్ధాలు, మింగ్ పై క్వింగ్ విజయం మొదలైనవి ఈ శతాబ్దంలో జరిగిన గొప్ప సైనిక సంఘర్షణలు.