వై. వి. ఎస్. చౌదరి
తెలుగు సినీ దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
వై. వి. ఎస్. చౌదరి (పూర్తి పేరు యలమంచిలి వేంకట సత్యనారాయణ చౌదరి) ప్రముఖ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు, నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిటరు, ఆడియో కంపెనీ అధినేత. 1998వ సంవత్సరంలో అక్కినేని నాగార్జున నిర్మాణంలో "గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్" సంస్థలో రూపొందిన శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా విజయం తరువాత అక్కినేని నాగార్జున, నందమూరి హరికృష్ణ కథానాయకులుగా సీతారామరాజు, మహేష్ బాబు కథానాయకుడిగా యువరాజు సినిమాలను తెరకెక్కించాడు. తరువాత "బొమ్మరిల్లు వారి" నిర్మాణ సంస్థను స్థాపించి లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో నిర్మాతగా మారాడు. దాని తరువాత సీతయ్య, దేవదాసు, ఒక్క మగాడు, సలీమ్, రేయ్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. వీటిలో సలీమ్ మినహా మిగతా సినిమాలన్నింటినీ తానే నిర్మించాడు. చౌదరి ఇప్పటివరకు తొమ్మిది సినిమాలకు దర్శకత్వం వహించాడు. 2012లో రవితేజ కథానాయకుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో నిప్పు సినిమాను నిర్మించాడు. మొదటి సినిమాతో వెంకట్, చాందిని, చందు అనే నటులను పరిశ్రమకు పరిచయం చేశాడు. లాహిరి లాహిరి లాహిరిలోతో ఆదిత్య ఓం, అంకిత లను పరిచయం చేశాడు. దేవదాసుతో రామ్, ఇలియానా, రేయ్ తో సాయి ధరమ్ తేజ్, సైయామి ఖేర్ లను పరిచయం చేశాడు. తరువాతికాలంలో వీళ్ళు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటులుగా స్థిరపడ్డారు.
వై. వి. ఎస్. చౌదరి | |
---|---|
జననం | యలమంచిలి వేంకట సత్యనారాయణ చౌదరి 23 మే 1965[1] |
వృత్తి | రచయిత, దర్శకుడు, నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిటరు, ఆడియో కంపెనీ అధినేత |
క్రియాశీల సంవత్సరాలు | 1998 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | గీత |
పిల్లలు | యుక్త చౌదరి, ఏక్తా చౌదరి |
తల్లిదండ్రులు |
|
నందమూరి తారకరామారావు అభిమానిగా, అతడి స్పూర్తితోనే చిత్రసీమలో అడుగుపెట్టానని చౌదరి చెబుతాడు.[2][3]