ప్లాసీ యుద్ధం
బెంగాలు నవాబుకు, బ్రిటిషు ఈస్టిండియా కంపెనీకీ మధ్య జరిగిన యుద్ధం / From Wikipedia, the free encyclopedia
ప్లాసీ యుద్ధం, బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాలు నవాబు, అతడి ఫ్రెంచి మిత్రుల కూటమిపై నిర్ణయాత్మక విజయం సాధించిన యుద్ధం. 1757 జూన్ 23 న జరిగిన ఈ యుద్ధం, బెంగాల్లో కంపెనీ స్థానాన్ని సుస్థిరపరచింది. తరువాతి వంద సంవత్సరాల్లో కంపెనీ తమ ప్రాబల్యాన్ని భారత్ అంతటా విస్తరించింది.
ప్లాసీ యుద్ధం | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
ఏడు సంవత్సరాల యుద్ధంలో భాగము | |||||||||
"ప్లాసీ యుద్ధం తరువాత మీర్ జాఫరు రాబర్టు క్లైవుల సమావేశం" - కాన్వాస్ పై ఆయిల్ చిత్రం . ఫ్రాన్సిస్ హేమన్ (1762) | |||||||||
| |||||||||
ప్రత్యర్థులు | |||||||||
ఇంగ్లాండు * బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ | మొగలు సామ్రాజ్యము * బెంగాలు రాజ్యం *ఫ్రాన్స్ | ||||||||
సేనాపతులు, నాయకులు | |||||||||
కర్నల్ రాబర్టు క్లైవు * మేజర్ కీల్పాట్రిక్ * మేజర్ గ్రాంట్ * మేజర్ ఐరీ కూట్ * కెప్టెన్ గాప్ | నవాబ్ సిరాజుద్దౌలా * మోహన్ లాల్ * మీర్ మదాన్ ఖాన్ * మీర్ జాఫరు (ఫిరాయింపుదారు) * యార్ లుతూఫ్ ఖాన్('ఫిరాయింపుదారు') * రాయ్ దుర్లభ్ (ఫిరాయింపుదారు) సిన్ఫ్రే | ||||||||
బలం | |||||||||
1,750 ఇంగ్లీషు సైనికులు 100 టోపాసులు 2,100 భారత సిపాయీలు 100 గన్నర్లు 8 శతఘ్నులు 2 హొవిట్జర్లు | మొగలు సామ్రాజ్యం:సిరాజుద్దౌలా యొక్క 7,000 కాల్బలం 5,000 అశ్శ్వికులు మీర్ జాఫరు యొక్క 35,000 కాల్బలం 15,000 అశ్వికులు 53 శతఘ్నులు ఫ్రాన్స్: 50 శతఘ్ని దళం (6 శతఘ్నులు) | ||||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||||
22 మరణం 50 క్షతగాత్రులు | 500 మృతులు, క్షతగాత్రాలు |
ఈ యుద్ధం బెంగాల్లో భాగీరథి నదీ తీరంలోని ప్లాసీ (ప్రస్తుత పలాషి) వద్ద జరిగింది. ఈ ప్రదేశం కలకత్తాకు ఉత్తరాన 150 కిమీ వద్ద, అప్పటి బెంగాలు రాజధాని ముర్షిదాబాదుకు దక్షిణాన ఉంది. బెంగాలు నవాబు సిరాజుద్దౌలా, ఇస్ట్ ఇండియా కంపెనీ ఈ యుద్ధంలో ప్రత్యర్థులు. సిరాజుద్దౌలా అంతకు ఏడాది ముందే బెంగాలు నవాబయ్యాడు. వెంటనే అతడు ఇంగ్లీషువారిని వారి కోటల విస్తరణను ఆపమని ఆదేశించాడు. రాబర్టు క్లైవు, నవాబు యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైన మీర్ జాఫరును లంచంతో లోబరచుకుని, అతణ్ణి బెంగాలు నవాబును చేస్తానని ఆశ గొలిపీ, తన పక్షానికి తిప్పుకున్నాడు. ప్లాసీ యుద్ధంలో క్లైవు, బెంగాలు నవాబును ఓడించి కలకత్తాను స్వాధీనపరచుకున్నాడు.[1]
ఈ యుద్ధానికి ముందు సిరాజుద్దౌలా బ్రిటిషు వారి నియంత్రణలో ఉన్న కలకత్తాపై దాడి చెయ్యడం, చీకటి గది మారణకాండ చేయించడం జరిగాయి. బ్రిటిషు వారు రాబర్టు క్లైవు నాయకత్వంలో మద్రాసు నుండి అదనపు బలగాలను పంపించి కలకత్తాను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ వెంటనే క్లైవు ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న చందర్నగర్ కోటను వశపరచుకున్నాడు.[2] బ్రిటిషువారికీ, సిరాజుద్దౌలాకూ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు, పరస్పర అనుమానాలు ప్లాసీ యుద్ధానికి దారితీసాయి. సంఖ్యపరంగా సిరాజుద్దౌలా సైన్యం, బ్రిటిషు సైన్యం కంటే చాలా ఎక్కువ. ఈ విషయమై ఆందోళన చెందిన క్లైవు, మీర్ జాఫరు, యార్ లుతూఫ్ ఖాన్, ఓమిచంద్, రాయ్ దుర్లభ్, జగత్ సేఠ్లతో కలిసి కుట్రపన్నాడు. దాని ప్రకారం వీళ్ళంతా యుద్ధభూమికి తమ సైన్యాలతో వచ్చినప్పటికీ, యుద్ధంలో పాల్గొనలేదు. ఫలితంగా 18,000 మందితో కూడిన సిరాజుద్దౌలా సైన్యం, కేవలం 3,000 క్లైవు సైన్యం చేతిలో పరాజయం పొందింది. యుద్ధం కేవలం 40 నిముషాల్లో ముగిసిపోయింది.
సామ్రాజ్యవాదులు భారత్ను ఆక్రమించుకోవడంలో ఈ యుద్ధం కీలకమైనదిగా భావిస్తారు. దీనితో బ్రిటిషువారికి బెంగాలు నవాబుపై అధిపత్యం కలిగింది. తద్వారా తమకు జరిగిన యుద్ధ, వ్యాపార నష్టాలకు పరిహారంగా అతడి నుండి ఎన్నో రాయితీలను పొందారు. ఈ సొమ్మును తమ సైనిక శక్తిని పెంపొందించుకునేందుకు, తమ ఐరోపా ప్రత్యర్థులను దక్షిణాసియా నుండి వెళ్ళగొట్టి, తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకూ వాడుకున్నారు.