తిరుమల ప్రసాదం
From Wikipedia, the free encyclopedia
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి నైవేద్యంగా[నోట్స్ 1] నివేదించి, భక్తులకు పంచిపెట్టే లడ్డు, వడ వంటి తినే పదార్థాలు తిరుమల ప్రసాదంగా ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం లడ్డు తిరుమలలో శ్రీవారి ప్రసాదాల్లో అత్యంత ప్రాచుర్యం పొంది, తిరుమల ప్రసాదం అంటే గుర్తుకువచ్చేలా పేరు తెచ్చుకుంది. అయితే చారిత్రకంగా 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ళ వరకూ వడకు తిరుమల ప్రసాదంగా ప్రస్తుతం లడ్డుకు ఉన్న పేరు ఉండేది. మనోహరం పడిగా పిలిచే సున్నుండ వంటి ప్రసాదానికి కూడా 16-20 శతాబ్దాల కాలంలో ప్రాముఖ్యత ఉండేది. ఈ రెండు ప్రసాదాల ప్రాధాన్యతను 20వ శతాబ్ది నుంచి సెనగపిండితోనూ, పంచదారతోనూ చేసే ప్రస్తుత తిరుపతి లడ్డు తీసుకుంది.
విజయనగర కాలంలోనూ, ఆ తర్వాత రాజులు, ఉన్నతోద్యోగులు, సంపన్నులు ప్రసాదాల నిమిత్తం ఇచ్చిన డబ్బు మూలనిధిగా చేసి కానీ, వారు భూములు, గ్రామాల రూపంగా ఇస్తే వాటి మీద వచ్చే ఆదాయంతో కానీ ప్రసాదాలు తయారుచేసేవారు. ఆ ప్రసాదాల్లో నాలుగింట ఒక వంతు దాతకు, మిగతా ప్రసాదంలో స్థానత్తార్లు (ధర్మకర్తలు), ఆలయ సిబ్బంది, మఠాల వార్లు వంటివారికి వాటా ఉండేది. స్థానత్తార్లు, సిబ్బంది ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని తిరుమల ప్రసాదాలను అమ్మి, ఆ అమ్మకాన్నే సంపద కూడబెట్టుకోవడానికి మార్గంగా తీసుకునేవారు. సాళువ వీరనరసింహరాయలు తన హయాంలో తిరుమలలో స్వామివారికి నైవేద్యాల నిమిత్తం అనేక దానాలు చేసి, దాతగా తనకు వచ్చిన భాగాన్ని ఉపయోగించి అన్నదాన సత్రాలు, ప్రసాద వితరణ ఏర్పాట్లు చేశాడు.
విజయనగర సామ్రాజ్యం అత్యున్నత దశకు చేరుకునేనాటికి, తిరుమల వైభవం ప్రసాదాల రూపంలో కళ్ళకు కట్టింది. రాజులు, అధికారులు, సంపన్నులు ఏర్పాటుచేసిన దానాలు వందలాది గంగాళాల్లో, వందల రకాల నైవేద్యాలు తయారుచేసి రోజుకు వందసార్లు నివేదించే పరిస్థితి వచ్చింది. ఈస్టిండియా కంపెనీ కాలంలో ఆర్థిక, మతపరమైన కారణాలతో తిరుమలలో నైవేద్యాల కోసం వందల ఏళ్ళుగా దాతలు ఇచ్చిన దేవదేయాల భూములు, గ్రామాలను ఈస్టిండియా ప్రభుత్వం జప్తుచేసుకుని, ఆ ఆదాయం మీద ఏర్పాటుచేయాల్సిన అన్ని నైవేద్యాలను నిలిపివేసింది. 1840లో తిరిగి ఆలయ నిర్వహణ కంపెనీ చేతి నుంచి మహంతులకు అప్పగించాకా దేవాలయానికి సమకూడే ఆదాయంతో పూర్వపు పద్ధతుల్లో నైవేద్యాలు చేయడం మొదలుపెట్టి, ఇప్పటిదాకా ఆ పద్ధతే కొనసాగుతోంది.
ప్రస్తుతం తిరుమలలో అన్నప్రసాదాన్ని నిత్యాన్నదాన భవనంలోనూ, ఇతర ప్రదేశాల్లోనూ ఉచితంగా వితరణ చేస్తూండగా, దర్శనం చేసుకున్నవారికి ఏదోక రకం ప్రసాదాన్ని తినేందుకు, కనీసం ఒక లడ్డూ అయినా తీసుకువెళ్ళేందుకు ఉచితంగా ఇస్తున్నారు. మిగిలిన ప్రసాదాలను భక్తులు ఒక పరిమితి మేరకు కొనుక్కోవచ్చు. నైవేద్యాల తయారీకి వంశపారంపర్యంగా చేసే పోటు మిరాశీదారుని 1980వ దశకంలో మిరాశీ వ్యవస్థ రద్దులో భాగంగా తొలగించి, కొన్నాళ్ళు తితిదే నేరుగాను, ఆపైన తయారీ గుత్తేదారులకు అప్పగించడం ద్వారానూ చేస్తోంది.