కాకతీయుల కాలంలో వ్యవసాయ రంగం
కాకతీయ పరిపాలనా కాలంలో వ్యవసాయ రంగ స్థితిగతులు / From Wikipedia, the free encyclopedia
కాకతీయుల కాలం (11వ శతాబ్ది - 13వ శతాబ్ది) లో ప్రజల ప్రధానవృత్తి యైన వ్యవసాయం వారి ఆర్థిక వ్యవస్థలో ముఖ్యపాత్ర పోషించింది. గోధుమలు, వరి, కొర్రలు, జొన్నలు, చెరుకు వంటివి, తోటల వ్యవసాయంతో కొబ్బరి, జామ, మామిడి, అరటి వంటి పంటలు పండించేవారు. కొన్ని ఆహార పంటలు కాగా, మరికొన్ని పంటలు పంచదార, బెల్లం, నూనె, వస్త్ర పరిశ్రమలకు ఆధారంగా ఉండేవి. దానితో కాకతీయ చక్రవర్తులు వ్యవసాయాభివృద్ధికి ప్రత్యేక సంస్కరణలు చేపట్టారు. సాగునీటి వనరుల పెంపు కోసం చెరువులు, భారీ సరస్సుల నిర్మాణం, సాగులో లేని కొత్త భూములలో వ్యవసాయం చేపట్టడానికి ప్రత్యేక చర్యలు వంటివి కాకతీయుల వ్యవసాయ విధానంలో కీలకంగా ఉండేవి. 11వ శతాబ్ది అర్థభాగంలో కాకతీయులు స్వాతంత్ర్యం ప్రకటించుకోవడానికి కొన్నేళ్ళ ముందు నుంచీ వారు వ్యవసాయరంగంపై దృష్టిపెట్టడం, సంస్కరణలు చేపట్టడం ప్రారంభమవుతున్న ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కృషి కాకతీయ సామ్రాజ్య పతనం వరకూ కొనసాగాయి. ఈ చర్యల ద్వారా కాకతీయ సామ్రాజ్య వ్యాప్తంగా వందలాదిగా చెరువులు, సరస్సులు ఏర్పడ్డాయి. అడవులను కొట్టి శ్రీశైలం, పాకాల, మంథని, ఏటూరు నాగారం వంటి ప్రాంతాల్లో లక్షలాది ఎకరాలను సాగుకు తెచ్చి, వందల గ్రామాలను ఏర్పరిచారు.