దోసె
దక్షిణ భారతదేశంలోని అల్పాహారం / From Wikipedia, the free encyclopedia
దోశ, దక్షిణభారతీయులకు ఇష్టమైన అల్పాహారం. దోశ పుట్టుపూర్వోత్తరాలు అంతగా తెలియదు. ఎప్పటి నుండి ఇవి వాడుకలో ఉన్నాయో కచ్చితమైన ఆధారలు లేవు. దోశ భారతీయులకు అందరికీ పరిచయమైన అహారమే అయినా దక్షిణ భారతీయులకు మాత్రం ఇది అత్యంత ఇష్టమైన అల్పాహారం. దీనిని దోశ, దోసె, దోసై, అట్టు అని కూడా ప్రాంతాల వారిగా అంటూ ఉంటారు. అంతేకాదు అట్లకోసం ఒక పండుగ కూడా ఉంది. అదే అట్ల తద్ది. అట్ల కొరకు నోములు కూడా చేస్తారు. కన్నెపిల్లలు మంచి భర్త రావాలని కోరుతూ ఈ నోము చేస్తారు. వివాహము అయిన తరువాత ఈ నోము తప్పక తీర్చుకోవడం కొంత మందిలో ఆనవాయితీగా వస్తుంది. స్త్రీలు అట్లతద్ది నాడు శుచిగా 11 అట్లు పోసి వాటి మధ్య పప్పు, బెల్లం, నెయ్యి ఉంచి ఇంటి సింహద్వారం పూజించి అట్లను నైవేద్యంగా ఉంచి నమస్కరిస్తారు. దీనిని ఎక్కువగా తెలుగు వారు ఆచరిస్తారు. నోము నోచుకున్న వారు అట్లు పోసి ఒక్కొక్కరికి 11 అట్లను పప్పు, బెల్లం, నెయ్యి చేర్చి ముత్తైదువలకు వాయనం ఇస్తారు. ఇలా అట్లకు సంప్రదాయంలో కూడా చోటు ఉంది. పాత కాలంలో స్త్రీలు ఉద్యోగాలు చేయరు కనుక ఆర్థికంగా జరుగుబాటు తగ్గిన సమయంలో ఇంట్లో అట్లు తయారు చేసి అమ్మడం ద్వారా జీవనం సాగిస్తుంటారు. ఇవి కూడా తెలుగు నాట ప్రసిద్దం. తెలుగు వారికి చాలా మందికి ఇవి పరిచయమే. ఇంటి రుచితో అందిస్తారు కనుక అలాగే కొంత అందుబాటు వెలలో లభ్యమవుతాయి కనుక వీటికి ప్రజాదరణ అధికంగానే ఉంటుంది. వీటిలో తెలుగు వారి ప్రత్యేకం పెసరట్టు. పెసరట్టు అల్లం చట్నీతో తినడం ఆనవాయితీ. పెసరట్టు పులవబెట్టనవసరం లేదు. ఇలా దోశలతో దక్షిణ భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. ముఖ్యంగా తెలుగు వారికి మరింత ఇష్టమైన అల్పాహారం. ఇవి ఉడిపి హోటళ్ళలో బాగా ప్రసిద్ధిచెందాయి. దోసెలతో సహా పచ్చడి, కూర కూడా ఇస్తుంటారు. దీనిలో ముఖ్యమైన పదార్థం మినుములు.