గిరీశం
గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కంలోని పాత్ర / From Wikipedia, the free encyclopedia
గిరీశం కన్యాశుల్కం నాటకంలో గురజాడ అప్పారావు సృష్టించిన కాల్పనిక పాత్ర. కన్యాశుల్కం నాటకానికి ఉన్న తొలి, మలి కూర్పులు రెంటిలోనూ గిరీశం ప్రధాన పాత్ర. కన్యాశుల్కం నాటకంలో అతనిది ప్రధాన పాత్రే అయినా నాయక పాత్ర కాదు.
గిరీశం | |
---|---|
మొదటి దర్శనం | కన్యాశుల్కం (మొదటి కూర్పు) |
సృష్టికర్త | గురజాడ అప్పారావు |
Portrayed by | ఎన్.టి.రామారావు (కన్యాశుల్కం సినిమా) జె. వి. రమణమూర్తి (వెయ్యికి పైగా కన్యాశుల్కం ప్రదర్శనలు, దూరదర్శన్ సీరియల్) గొల్లపూడి మారుతీరావు (మాటీవీ సీరియల్, నాటక ప్రదర్శనలు) గోవిందరాజు సుబ్బారావు (నాటక ప్రదర్శనలు) ఉత్తేజ్ (నాటక ప్రదర్శన) తదితరులు. |
సమాచారం | |
పూర్తిపేరు | నేమాని గిరీశం |
లింగం | పురుషుడు |
దాంపత్యభాగస్వామి | అవివాహితుడు |
బంధువులు | లుబ్దావధానులు (పెదతల్లి కుమారుడు; అన్నయ్య) |
మతం | హిందూ మతం |
జాతీయత | బ్రిటీష్ ఇండియా, భారతీయుడు |
కన్యాశుల్కంలో విజయనగరంలో అప్పులు, చేసిన తప్పులు చుట్టుముట్టడంతో శిష్యుడు వెంకటేశానికి చదువుచెప్పే మిషతో అతని ఊరైన కృష్ణరాయపుర అగ్రహారానికి వెళ్తాడు. అక్కడ బాల్యవివాహం వల్ల మీదపడ్డ వైధవ్యంతో కాలం గడుపుతున్న వెంకటేశం అక్క బుచ్చమ్మను ప్రేమలోకి దింపి పెళ్ళాడదామని, తద్వారా రకరకాలుగా డబ్బు, ఆస్తి కలిసివస్తుందని ఆలోచిస్తాడు. బుచ్చమ్మ చెల్లెలికీ ముసలివాడితో పెళ్ళిచేయబోగా, దాన్ని తప్పించేందుకు అని వంక పెట్టి బుచ్చమ్మను తీసుకుపోతాడు. విజయనగరంలో సంస్కర్త, న్యాయవాది అయిన సౌజన్యారావు పంతులు వద్ద వినయం నటించి నమ్మిస్తాడు. ఇతను మొదట్లో ఉంచుకున్న మధురవాణి బండారం బయటపెట్టడంతో కథ అడ్డం తిరుగుతుంది.
గిరీశం వేశ్యాసాంగత్యం, మోసాలు, అబద్ధాలు, ఆడంబరాలు మరిగిన పాత్ర. అవసరానికి ఏదోక చక్రం అడ్డువేసి రోజులు గడుపుకుంటూ, వీలుంటే కొండకు వెంట్రుక వేద్దామని చూస్తూంటాడు. ఈ పాత్ర లక్ష్యం, దాని సిద్ధి, అసలు స్వభావంలోని కీలకం వంటి విషయాల మీద విమర్శకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గిరీశం పాత్రలోని కీలకం "బ్రతుకుతెరువు" అనీ, అది హానికరమైన పాత్ర కాదని కొందరు భావిస్తే, ఆ స్థితి లేక కించిత్తు అధికారం ఉన్నా దాన్ని విపరీతంగా దుర్వినియోగం చేసే పాత్రేనని మరికొందరి అభిప్రాయం. గిరీశం పాత్ర మీద ప్రేక్షకులకు అసహ్యం కలగకపోవడం వల్లనే నాటకం రక్తికట్టిందని ఒకరు అంటే, ఆ పాత్ర ప్రేక్షకులను ఆకర్షించడం వల్ల నాటకం సాంఘిక ప్రయోజనం దెబ్బతిందని మరికొందరు విశ్లేషించారు.
గిరీశం పాత్ర, దాని సంభాషణలు, నాటకాల్లో గిరీశం పాత్ర రూపురేఖలు కన్యాశుల్కం నాటకం పరిధిని దాటి తెలుగు జన జీవితం మీద ప్రభావం చూపుతూనే ఉన్నాయి. గురజాడ రాసిన కొండుభొట్టీయం నాటకంలోనూ, ముళ్ళపూడి వెంకటరమణ రాసిన గిరీశం లెక్చర్లులోనూ, బాపు-రమణల సినిమా రాంబంటులోనూ గిరీశం పాత్ర మళ్ళీ వస్తుంది. "డామిట్! కథ అడ్డంగా తిరిగింది", "నాతో మాట్టాడ్డవేఁ ఒక ఎడ్యుకేషన్" వంటి అతని సంభాషణలు తెలుగు నుడికారంలో భాగమయ్యాయి. వెయ్యికి పైగా నాటక ప్రదర్శనల్లోనూ, దూరదర్శన్ సీరియల్లోనూ గిరీశంగా నటించిన జె. వి. రమణమూర్తి మరో గిరీశంగా పేరు తెచ్చుకున్నాడు. 1955 నాటి కన్యాశుల్కం సినిమాలో ఎన్.టి.రామారావు, 2005 నాటి మాటీవీ సీరియల్లోనూ, మరికొన్ని రంగస్థల ప్రదర్శనల్లో గొల్లపూడి మారుతీరావు వంటివారు గిరీశంగా నటించారు. అలనాడు గోవిందరాజు సుబ్బారావు నుంచి ఇటీవల ఉత్తేజ్ దాకా పలువురు గిరీశం పాత్ర ధరించారు.