హృద్ధమనులు
From Wikipedia, the free encyclopedia
గుండె మన దేహంలో వివిధ అవయవాలకు రక్తప్రసరణ సమకూర్చి అవయవాల జీవప్రక్రియకు అవసరమయే ప్రాణవాయువును పోషకపదార్థాలను అందిస్తుంది. జీర్ణమండలం నుండి మనం తినే ఆహారంలోని పోషకపదార్థాలు రక్తప్రసరణ వలన వివిధ అవయవాలకు చేరుతాయి. ఊపిరితిత్తులు వాటికి చేరే రక్తానికి ప్రాణవాయువును చేర్చి ఆ రక్తంలోని బొగ్గుపులుసు వాయువును విసర్జిస్తాయి. మూత్రపిండాలు, కాలేయం రక్తంలోని మాలిన్యాలను తొలగిస్తాయి. వివిధ వినాళగ్రంథ స్రావకాలు కూడా రక్తప్రసరణ ద్వారా అవయవాలకు చేరుతాయి. అన్ని అవయవాల జీవక్రియలకు వాటి పనులు అవి నెరవేర్చుటకు రక్తప్రసరణ అవసరం. ఇంత ముఖ్యమైన రక్త ప్రసరణ గుండె ఒక తోడు యంత్రంలా నిరంతరం క్రమబద్ధంగా పనిచేయడం వలన సాధ్యపడుతుంది.
హృదయం నాలుగు అరలు గల కండరం. మీది అరలను కర్ణికలని క్రింది అరలను జఠరికలని వ్యవహరిస్తారు. హృదయకండరం అసంకల్పిత స్వయంచాలిత కండరం. తనంతట తానే పనిచేసుకుపోగలదు. కాని నరాల ద్వారా మెదడు ఆధీనత కూడా గుండెపై ఉంటుంది. మిగిలిన అవయవాల వలె గుండెకు కూడా అవసరమయే పోషకపదార్థాలు, ప్రాణవాయువు రక్తపసరణ ద్వారా అందుతాయి.
హృదయానికి రక్తప్రసరణ ఎడమ హృద్ధమని (లెఫ్ట్ కరోనరీ ఆర్టెరీ), కుడి హృద్ధమని (రైట్ కరోనరీ ఆర్టెరీ) సమకూరుస్తాయి[1]. ధమనీకాఠిన్యత ( ఎథిరోస్క్లీరోసిస్) వలన హృద్ధమనుల, వాటి శాఖల లోపలి పరిమాణం బాగా తగ్గితే దేహం శ్రమించునపుడు హృదయం అవసరాలకు తగిన రక్తప్రసరణ అందక గుండెనొప్పులు కలుగగలవు. ధమనులలో కాఠిన్యపు ఫలకలు ( ప్లేఖ్స్) చిట్లి వాటిపై నెత్తురు గడ్డలు ఏర్పడితే రక్తప్రవాహానికి తీవ్రభంగం కలుగవచ్చు. అప్పుడు ప్రాణవాయువు, పోషకపదార్థాలు అందని హృదయ కండరకణజాలం మరణిస్తే గుండెపోటులు కలుగుతాయి. గుండెపోటులు ప్రాణాపాయానికి దారితీయవచ్చు. హృద్ధమని వ్యాధులకు చికిత్సలు కూడా గత మూడు దశాబ్దాలుగా మెరుగవుతూ ఉన్నాయి.