వినాయక్ దామోదర్ సావర్కర్
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించి అమరుడైన మహనీయుడు / From Wikipedia, the free encyclopedia
వినాయక్ దామోదర్ సావర్కర్ (1883 మే 28 - 1966 ఫిబ్రవరి 26) భారత రాజకీయ నాయకుడు, కార్యకర్త, రచయిత. ఈయన 1922 లో రత్నగిరి కారాగారంలో ఉండగా హిందూత్వ అనే రాజకీయ హిందూ జాతీయవాదాన్ని అభివృద్ధి చేశాడు. హిందు మహాసభ ఏర్పాటులో ఈయన కీలక సభ్యుడు. తన ఆత్మకథ రాసినప్పటి నుంచి ఆయన పేరు ముందు వీర్ అనే పదాన్ని వాడటం ప్రారంభించాడు.[3] హిందూ మహాసభలో చేరిన తర్వాత హిందువులనందరినీ భారతీయత పేరు మీదుగా ఏకతాటిపైకి తెచ్చేందుకు హిందూత్వ[4] అనే పదాన్ని వాడాడు.[5][6] సావర్కర్ నాస్తికుడు.[7]
వినాయక్ దామోదర్ సావర్కర్ | |
---|---|
జననం | (1883-05-28)1883 మే 28 |
మరణం | 1966 ఫిబ్రవరి 26(1966-02-26) (వయసు 82) బొంబాయి, మహారాష్ట్ర, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | హిందూ |
రాజకీయ పార్టీ | హిందు మహాసభ |
జీవిత భాగస్వామి | యమునాబాయి
(m. 1901; died 1963) |
బంధువులు | గణేష్ దామోదర్ సావర్కర్ (సోదరుడు) |
సావర్కర్ ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉండగానే తన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించాడు. పుణె లోని ఫెర్గూసన్ కళాశాలలో కూడా వీటిని కొనసాగించాడు. ఇతను తన సోదరుడితో కలిసి రహస్యంగా అభినవ భారత్ సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. తర్వాత తన న్యాయవిద్య కోసం యుకెకి వెళ్ళినపుడు అక్కడ ఇండియా హౌస్, ఫ్రీ ఇండియా సొసైటీ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించాడు. విప్లవం ద్వారా భారతదేశం సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందాలని పుస్తకాలు రాశాడు. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామాన్ని గురించి ఈయన రాసిన ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని బ్రిటిష్ వారు నిషేధించారు.[8]
1910 లో విప్లవ సంస్థ ఇండియా హౌస్ తో సంబంధాలు కలిగి ఉన్నందున ఈయనను అరెస్ట్ చేసి భారత్ కు తరలించారు. భారత్ కు వచ్చే దారిలో ఫ్రాన్స్ లో తాను ప్రయాణించే ఓడ ఎస్ ఎస్ మర్సీలెస్ నుంచి నీళ్ళలో దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఫ్రెంచి ఓడరేవు అధికారులు అతన్ని తిరిగి బ్రిటిష్ అధికారులకు అప్పగించారు. భారత్ కు రాగానే సావర్కర్ కు 50 ఏళ్ళ జైలు శిక్ష విధించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను అండమాన్ దీవుల్లోకి సెల్యులార్ జైలుకు తరలించారు. తర్వాత ఆయన బ్రిటిష్ అధికారులకు ఎన్నో క్షమాపణ లేఖలు రాసిన తర్వాత 1924 లో ఆయన్ను విడుదల చేశారు.[9] జైలు నుంచి విడుదలైన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించడం దాదాపు మానివేశాడు.[10]
1937 తర్వాత ఆయన విస్తృతంగా పర్యటించడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే వక్తగా, రచయితగా మారి హిందూ జాతీయవాదాన్ని, సమాజంలో ఏకత్వాన్ని సమర్ధించాడు. 1938 లో మరాఠీ సాహిత్య సమ్మేళన్ కు అధ్యక్షుడిగా ఉన్నాడు. హిందు మహాసభకు అధ్యక్షుడిగా భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రమనే భావనను ఆమోదించాడు. ముస్లింలు ప్రత్యేక పాకిస్థాన్ ఏర్పాటు అనే కల నుంచి బయటపడితే సిక్కులతో కలిసి సిక్కిస్థాన్ ఏర్పాటు చేయవచ్చని సిక్కులకు భరోసా ఇచ్చాడు. సావర్కర్ హిందూ రాజ్యం గురించే కాకుండా పంజాబ్ లో సిక్కుల కోసం సిక్కిస్థాన్ ఏర్పాటు గురించి కూడా ఆలోచించాడు.[11][12][13]
అయితే 1939 సంవత్సరంలో ముస్లిం లీగ్, కాంగ్రెస్ నుంచి వేరు పడటం, సావర్కర్ ను కాంగ్రెస్ తనలో కలుపుకోకపోవడం వలన ముస్లిం లీగ్ తో అనుబంధం ఏర్పరుచుకున్నాడు. అంతే కాకుండా రెండు దేశాలుగా ఏర్పడటాన్ని సమర్ధించాడు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించి దాన్ని అధికారికంగా బహిష్కరించాడు.[14] స్టిక్ టు యువర్ పోస్ట్స్ అనే ఒక లేఖ కూడా రాసి, రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యంలో చేరాడు.[15] 1948 లో సావర్కర్ ను మహాత్మా గాంధీ హత్యలో సహ కుట్రదారుగా చేర్చారు. అయితే ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతన్ని విడుదల చేసింది.