వర్ణ సమతౌల్యం
From Wikipedia, the free encyclopedia
ఛాయాచిత్రకళ, ప్రతిబింబ సంవిధాన రంగంలో వర్ణ సమతౌల్యం (ఆంగ్లం: Color Balance) అనునది ప్రాథమిక రంగులైన ఎరుపు, ఆకుపచ్చ, నీలంల తీవ్రతలని సంపూర్ణంగా సవరించే ప్రక్రియ. ఛాయాచిత్రంలో తటస్థ రంగుల (బూడిద రంగు, తెలుపు ల) సమతౌల్యాలు దెబ్బతినకుండా చూడటమే ఈ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక ప్రతిబింబం లోని రంగుల మిశ్రమం యొక్క మొత్తాన్ని వర్ణ సమతౌల్యం మారుస్తుంది. పైగా, సాధారణ వర్ణ సమతౌల్య పద్ధతులు తటస్థ రంగులనే కాక, ఇతర రంగులు కూడా సరిగ్గా, కంటికి ఇంపుగా కనబడేలా చేయగలవు.
ఫిలిం లేదా ఇమేజ్ సెన్సర్లు ప్రతిబింబం యొక్క అంశాలని గ్రహించిన తర్వాత సరియైన రంగులలో కంటికి కనబడటానికి తదనుగుణంగా మార్చబడాలి. ఇలా గ్రహింపబడటం, ప్రదర్శితమవటంలో అనేక కారకాలు ఫోటో లోని రంగుల పై ప్రభావం చూపుతాయి. ఒకే ప్రతిబింబాన్ని కెమెరా గ్రహించే తీరు, మానవ నేత్రం గ్రహించే తీరు వేరు వేరుగా ఉండటం, ప్రదర్శనకు ఎంచుకొన్న మాధ్యమం యొక్క లక్షణాలు, పరిసర వాతావరణం వంటి వాటి వలన రంగులలో కొన్ని సర్ధుబాట్లు చేయవలసి వస్తుంది.
పలు ప్రతిబింబ సంవిధాన ప్రక్రియలలో వర్ణ సమతౌల్య పద్ధతులు సాధారణంగా (ఏ వర్ణ గ్రాహకానికి, ఏ పునరుత్పత్తి మాధ్యమానికి సంబంధం లేకుండా) ఎరుపు, పసుపుపచ్చ, నీలం రంగుల యొక్క పిక్సెల్ ల విలువలపై అనువర్తింపబడతాయి. ఫిలింతో తీయబడు ఫోటోలకి లైట్లపైగానీ, కెమెరా కటకంపై గానీ వర్ణ సవరిణులను (Color correction filters) ఉపయోగించటంతో వర్ణ సమతౌల్యాన్ని సాధించవచ్చును.