మహారాజా నందకుమార్
From Wikipedia, the free encyclopedia
బెంగాల్ కు చెందిన మహారాజా నందకుమార్ (1705? – 1775) ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో బర్ద్వాన్, నదియా, హుగ్లీ జిల్లాలకు పన్ను వసూళ్ళ అధికారి. సమకాలీన పత్రాలలో నున్ కొమార్ (Nun Comar) గా వ్యవహరించబడ్డాడు. నాటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన వారన్ హేస్టింగ్స్ యొక్క క్రౌర్యానికి బలియైన వారిలో నందకుమార్ ప్రముఖుడు.[1] వారన్ హేస్టింగ్స్ చేసిన అవినీతి గురించి సాక్షాధారాలతో బెంగాల్ సుప్రీమ్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేసిన అనంతరం ఒక కల్పిత ఫోర్జరీ చేసిన కేసులో ఇరికించబడ్డాడు. విలియం ఫోర్ట్ లోని సుప్రీమ్ కోర్ట్ లో విచారించబడి 1775 ఆగస్టు 5 న కలకత్తాలో బహిరంగంగా ఉరి తీయబడ్డాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో ఒక బ్రిటిష్ కోర్ట్ తీర్పు ద్వారా ఉరితీయబడ్డ తొలి వ్యక్తి మహారాజా నందకుమార్.
మహారాజా నందకుమార్ పై జరిగిన నేర విచారణ కేసును న్యాయాన్ని అవహేళన చేసిన కేసు (Travesty of Justice) గా చరిత్రకారులు పరిగణిస్తారు. ఇతని ఉరితీతను బ్రిటిష్ ఇండియాలో జరిగిన తొలి న్యాయ హత్య (Judicial Murder) గా ఎడ్మండ్ బర్కీ, లార్డ్ మెకాలే లాంటి బ్రిటిష్ ప్రముఖులు పేర్కొన్నారు.
మహారాజ నందకుమార్ పై జరిగిన నేర విచారణ – విధించిన మరణదండన తీవ్ర విమర్శకు గురై బ్రిటిష్ పార్లమెంటును కుదిపింది. ఈ విషయానికి సంబంధించి తరువాతి కాలంలో వారన్ హేస్టింగ్స్తో పాటు ఉరిశిక్షను విధించిన సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎలిజా ఇంపేలు బ్రిటిష్ పార్లమెంటులో అభిశంసన ప్రక్రియకు గురయ్యారు. బ్రిటిష్ ఇండియా చరిత్రలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో అత్యన్నత పాలనాధికారి అయిన బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన వారన్ హేస్టింగ్స్ యొక్క అవినీతిని వెలికితీయడం ద్వారా భారతీయుడైన మహారాజా నందకుమార్ ఒక విధంగా బ్రిటిష్ ఇండియాలో తొలి విజిల్ బ్లోయరుగా గుర్తింపు పొందాడు.