మహాదేవ గోవింద రనడే
భారత పండితుడు, సాంఘిక సంస్కర్త మరియు రచయిత / From Wikipedia, the free encyclopedia
మహాదేవ గోవింద రనడే (1842 జనవరి 18 – 1901 జనవరి 16) ఒక భారతీయ విద్యావేత్త, సంఘ సంస్కర్త, న్యాయమూర్తి, రచయిత. ఇతను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు.[1] బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్లోనూ, కేంద్ర ఆర్థిక కమిటీల్లోనూ, బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పలు పదవులు నిర్వహించాడు.[2]
మహాదేవ గోవింద రనడే | |
---|---|
జననం | (1842-01-18)1842 జనవరి 18 నాసిక్ జిల్లా, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
మరణం | 1901 జనవరి 16(1901-01-16) (వయసు 58) ముంబై |
విద్యాసంస్థ | బాంబే విశ్వవిద్యాలయం |
వృత్తి | పండితుడు, సంఘ సంస్కర్త, రచయిత |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భారత జాతీయ కాంగ్రెస్ సహ వ్యవస్థాపకుడు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | రమాబాయి రనడే |
గోవింద రనడే ప్రజలకు బాగా తెలిసిన వ్యక్తి, ప్రశాంతమైన వ్యక్తిత్వం కలవాడు, ఓరిమి కలిగిన ఆశావాది. ఈ లక్షణాలే అతను బ్రిటన్ తో వ్యవహరించడం, భారతదేశంలో సంస్కరణలు అమలుచేయడం లాంటి కార్యక్రమాల్లో అతని వైఖరిని ప్రభావితం చేశాయి. రనడే జీవిత కాలంలో వక్తృత్వోత్తేజక సభ, పూర్ణ సార్వజనిక సభ, మహారాష్ట్ర గ్రంథోత్తేజక సభ, ప్రార్థనా సమాజం లాంటి సంస్థలను స్థాపించాడు. తన సాంఘిక, మత సంస్కరణల ఆలోచనలకు అనుగుణంగా ఇందుప్రకాష్ అనే మరాఠీ-ఆంగ్ల దినపత్రికను నిర్వహించాడు.ఇతను రావు బహదూర్ అనే బిరుదును అందుకున్నాడు.[3]