భారతదేశ వ్యవహారాల మంత్రి
From Wikipedia, the free encyclopedia
భారతదేశ వ్యవహారాల మంత్రి, బ్రిటిష్ క్యాబినెట్ మంత్రి, బ్రిటిషు భారతీయ సామ్రాజ్య పాలనకు బాధ్యత వహించే భారతదేశం ఏడెన్, బర్మాల కార్యాలయానికి, రాజకీయ అధిపతి. ఈ పదవిని ఇండియా సెక్రటరీ లేదా ఇండియన్ సెక్రటరీ అని పిలిచేవారు. 1858లో బెంగాల్లో ఈస్టిండియా కంపెనీ పాలన ముగిసినప్పుడు, సంస్థానాలు మినహా మిగతా భారతదేశమంతా బ్రిటిషు ప్రభుత్వపు ప్రత్యక్ష పరిపాలన కిందకు వచ్చినప్పుడు 1858లో ఈ పదవిని సృష్టించారు. దాంతో బ్రిటిష్ సామ్రాజ్యం క్రింద అధికారికంగా వలసపాలన కాలం ప్రారంభమైంది.
1937లో, భారతదేశ కార్యాలయాన్ని పునర్వ్యవస్థీకరించారు. బర్మా, ఏడెన్లను విడదీసి కొత్త బర్మా కార్యాలయం క్రిందకు తీసుకొచ్చారు. అయితే రెండు విభాగాలూ ఒకే మంత్రి కింద ఉండేవి. భారతదేశ, బర్మాల వ్యవహరాల మంత్రి (హిజ్ మెజెస్టీస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అండ్ బర్మా) పేరిట కొత్త పదవిని సృష్టించారు. 1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినపుడు, భారతదేశ కార్యాలయాన్ని, దాని మంత్రి పదవినీ రద్దు చేసారు. 1948 ప్రారంభంలో బర్మా స్వాతంత్ర్యం సాధించింది.