బ్రిటీష్ ఇండియాలోని ప్రెసిడెన్సీలు, ప్రావిన్సులు
From Wikipedia, the free encyclopedia
భారత ప్రావిన్సులు (పూర్వం బ్రిటీష్ ఇండియా ప్రెసిడెన్సీలు, అంతకుముందు ప్రెసిడెన్సీ పట్టణాలు) అన్నవి బ్రిటీష్ పరిపాలన కాలంలో భారత ఉపఖండంలోని పరిపాలనా విభాగాలు. వీటన్నిటినీ కలిపి బ్రిటీష్ ఇండియా అని పిలిచేవారు. 1612 నుంచి 1947 వరకూ ఇవి ఏదోక రూపంలో ఉన్నాయి, వీటిని మూడుగా విభజించి తెలుసుకోవచ్చు:
- 1612-1757 మధ్యకాలంలో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ మొఘల్ చక్రవర్తులు, స్థానిక పాలకుల అనుమతులు తీసుకుని పలు ప్రదేశాల్లో, అందులోనూ ప్రధానంగా భారతదేశపు తీరప్రాంతంలో వివిధ ఫ్యాక్టరీలు (వాణిజ్య కేంద్రాలు) నెలకొల్పారు. డచ్, ఫ్రెంచి వ్యాపార కంపెనీలు దీని ప్రత్యర్థులు. 18వ శతాబ్ది మధ్యకాలానికి వచ్చేసరికి మూడు "ప్రెసిడెన్సీ పట్టణాలు": మద్రాసు, బొంబాయి, కలకత్తా విస్తీర్ణంలో బాగా పెరిగాయి.
- 1757-1858 వరకూ భారతదేశంలో కంపెనీ పాలన సాగింది, ఈ కాలంలో భారతదేశంలో అత్యధిక ప్రాంతాల మీద కంపెనీ సార్వభౌమత్వాన్ని, నియంత్రణను సాధించింది - ఆ ప్రాంతాలను ప్రెసిడెన్సీలుగా పిలిచారు. ఐతే, క్రమేణా కంపెనీ ప్రభుత్వ వ్యవహారాలు బ్రిటీష్ ప్రభుత్వ పర్యవేక్షణకు లోనుకావడం పెరుగుతూ వచ్చింది, కంపెనీ దాని సార్వభౌమత్వాన్ని బ్రిటీష్ కిరీటంతో పంచుకోవాల్సివచ్చింది. అలానే భారతదేశంతో వాణిజ్య ప్రయోజనాలను కూడా కోల్పోసాగింది.
- 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత కంపెనీకి మిగిలిన అధికారాలు కూడా బ్రిటీష్ కిరీటం పరమయ్యాయి. కొత్త బ్రిటీష్ రాజ్ (1858-1947)లో సార్వభౌమత్వం ఎగువ బర్మా వంటి ఇతర ప్రాంతాలకు విస్తరించింది. పరిపాలనా సౌలభ్యం కలిగిస్తూ ప్రెసిడెన్సీలు ప్రావిన్సులగా విభజన అయ్యాయి.[1]