పారిశ్రామిక విప్లవం
From Wikipedia, the free encyclopedia
సుమారు 1760 నుండి 1820 - 1840 మధ్య కాలం వరకు ఐరోపా, అమెరికాల్లో కొత్త ఉత్పాదక ప్రక్రియల దిశగా జరిగిన పరివర్తనను పారిశ్రామిక విప్లవం అంటారు. ప్రస్తుతం దీన్ని మొదటి పారిశ్రామిక విప్లవం అని కూడా పిలుస్తున్నారు. చేతి ఉత్పత్తి పద్ధతుల నుండి యంత్రాలకు మళ్లడం, కొత్త రసాయనాల తయారీ, ఇనుము ఉత్పత్తి ప్రక్రియలు, ఆవిరి శక్తి, నీటి శక్తి ల వినియోగం, యంత్ర పరికరాల అభివృద్ధి, యాంత్రిక కర్మాగార వ్యవస్థలు ఈ పరివర్తనలో భాగం. పారిశ్రామిక విప్లవం, జనాభా పెరుగుదల రేటులో అపూర్వమైన పెరుగుదలకు దారితీసింది.
ఉపాధి, ఉత్పత్తి విలువల పరంగాను, పెట్టుబడి పరంగానూ పారిశ్రామిక విప్లవంలో వస్త్ర పరిశ్రమ ప్రధానమైనది. ఆధునిక ఉత్పత్తి పద్ధతులను ఉపయోగించిన మొట్టమొదటి పరిశ్రమ, వస్త్రం.[1]: 40
పారిశ్రామిక విప్లవం గ్రేట్ బ్రిటన్లో [lower-alpha 1] ప్రారంభమైంది. అప్పట్లో జరిగిన సాంకేతిక ఆవిష్కరణలు అనేకం బ్రిటన్లో జరిగినవే.[2][3] 18 వ శతాబ్దం మధ్య నాటికి, బ్రిటన్, ప్రపంచం లోని ప్రముఖ వాణిజ్య దేశంగా ఉండేది.[4] ప్రపంచ వాణిజ్య సామ్రాజ్యాన్ని ఉత్తర అమెరికా, కరేబియన్^ల లోని వలస రాజ్యాలతోను, భారత ఉపఖండం లోని సైనిక, రాజకీయ ఆధిపత్యంతోనూ (ముఖ్యంగా తొలి-పారిశ్రామిక మొఘల్తో బెంగాల్, ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాల ద్వారా), బ్రిటన్ నియంత్రిస్తూ ఉండేది.[5][6][7][8] పారిశ్రామిక విప్లవానికి వాణిజ్య అభివృద్ధి, వ్యాపార కార్యకలాపాలు పెరగడం ప్రధాన కారణాలు.[1] : 15
పారిశ్రామిక విప్లవం, చరిత్రలో ఒక ప్రధానమైన మలుపు. రోజువారీ జీవితంలోని దాదాపు ప్రతి అంశమూ ఏదో ఒక విధంగా దీనివలన ప్రభావితమైంది. ముఖ్యంగా, సగటు ఆదాయంలోను, జనసంఖ్యలోనూ అపూర్వమైన, నిరంతర వృద్ధి జరిగింది. పారిశ్రామిక విప్లవపు ప్రధాన ప్రభావం ఏమిటంటే, పాశ్చాత్య ప్రపంచంలో సాధారణ ప్రజల జీవన ప్రమాణం చరిత్రలో మొట్టమొదటిసారిగా స్థిరంగా పెరగడం మొదలవడమే అని కొందరు ఆర్థికవేత్తలు చెబుతారు. అయితే అర్ధవంతమైన అభివృద్ధి మాత్రం 19 వ శతాబ్దం చివరిలో, 20 శతాబ్దంలో గాని మొదలవలేదని మరికొందరు అంటారు.[9][10]
పారిశ్రామిక విప్లవానికి ముందు, ఆధునిక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఆవిర్భావానికి ముందూ తలసరి ఆదాయం నిలకడగా ఉండేది. పారిశ్రామిక విప్లవంతో, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో తలసరి ఆదాయంలో వృద్ధి మొదలైంది. జంతువుల మచ్చిక, వ్యవసాయం తరువాత, మానవజాతి చరిత్రలో పారిశ్రామిక విప్లవమే అతి ముఖ్యమైన సంఘటన అని ఆర్థిక చరిత్రకారులు అంగీకరిస్తున్నారు.
ఆర్థిక, సామాజిక మార్పుల వేగం ఎప్పుడు పుంజుకుందనే విషయం లాగానే పారిశ్రామిక విప్లవం కచ్చితంగా ఎప్పుడు మొదలై, ఎప్పుడు ముగిసింది అనే విషయాలు కూడా చరిత్రకారులలో ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. పారిశ్రామిక విప్లవం 1780 లలో బ్రిటన్లో ప్రారంభమైందని, 1830 - 1840 ల నాటికి గానీ వాటి ప్రభావం పూర్తిగా అనుభవం లోకి రాలేదనీ ఎరిక్ హాబ్స్బామ్ అభిప్రాయపడ్డాడు. అయితే టిఎస్ ఆష్టన్ మాత్రం 1760 - 1830 ల మధ్య ఇది జరిగిందని అభిప్రాయపడ్డాడు. వేగవంతమైన పారిశ్రామికీకరణ మొదట 1780 లలో బ్రిటన్లో యాంత్రిక స్పిన్నింగ్తో ప్రారంభమైంది. ఆవిరి శక్తి, ఇనుము ఉత్పత్తిలో అధిక వృద్ధి రేటు 1800 తరువాత సంభవించాయి. యాంత్రిక వస్త్ర ఉత్పత్తి 19 వ శతాబ్దం ప్రారంభంలో గ్రేట్ బ్రిటన్ నుండి ఐరోపా ఖండం, అమెరికాలకు వ్యాపించింది. వస్త్రాలు, ఇనుము, బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు బెల్జియం, అమెరికా లోను, తరువాత ఫ్రాన్స్లో వస్త్ర పరిశ్రమా ఉద్భవించాయి.[1]
పారిశ్రామిక విప్లవంలో జరిగిన అసలు ఆవిష్కరణలైన యాంత్రిక స్పిన్నింగు, యాంత్రిక నేత వంటి పద్ధతులను అనుసరించడం మందగించడం వలన, వాటి మార్కెట్లు పరిపక్వం చెందడం వలనా, 1830 ల చివరి నుండి 1840 ల ప్రారంభం వరకు ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఈ కాలంలో వెలుగు చూసిన లోకోమోటివ్స్, స్టీమ్బోట్లు, స్టీమ్షిప్లను ప్రవేశపెట్టడం, హాట్ బ్లాస్ట్ ఐరన్ స్మెల్టింగ్ ఆవిష్కరణలు, 1840, 1850 లలో విస్తృతంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్ టెలిగ్రాఫ్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు అన్నీ కూడా అధిక అభివృద్ధి వేగాలను సాధించలేకపోయాయి. 1870 తరువాత కొత్త వర్గాల ద్వారా వేగవంతమైన ఆర్థిక వృద్ధి ప్రారంభమైంది. దీన్ని రెండవ పారిశ్రామిక విప్లవం అని పిలుస్తున్నారు. ఈ కొత్త ఆవిష్కరణలలో కొత్తకొత్త ఉక్కు తయారీ ప్రక్రియలు, భారీ ఉత్పత్తి, అసెంబ్లీ లైన్లు, ఎలక్ట్రికల్ గ్రిడ్ వ్యవస్థలు, పెద్ద ఎత్తున యంత్ర పరికరాల తయారీ, ఆవిరి శక్తితో నడిచే కర్మాగారాల్లో పెరుగుతున్న ఆధునిక యంత్రాల వాడకం వంటివి ఉన్నాయి.[1][11]