దీర్ఘ కృపాణ రాత్రి
1934 లో జర్మనీలో హిట్లర్ చేపట్టిన ప్రత్యర్థుల ఏరివేత కార్యక్రమం / From Wikipedia, the free encyclopedia
1934 లో జూన్ 30, జూలై 2 ల మధ్య నాజీ జర్మనీలో హిట్లర్ తన అనుయాయులలో ఉన్న వ్యతిరేకులను హత్య చేసిన కార్యక్రమమే దీర్ఘ కృపాణ రాత్రి. దీనినే రోహ్మ్ ఏరివేత అని, ఆపరేషన్ హమ్మింగ్బర్డ్ (జర్మన్ భాషలో అంటర్నెహ్మెన్ కోలిబ్రి) అనీ కూడా అంటారు. తన అధికారాన్ని సుస్థిర పరచుకునేందుకు గాను చట్టానికి అతీతంగా హిట్లర్ జరిపిన మారణ హోమమే ఈ ఆపరేషను. నాజీలకు చెందిన పారామిలిటరీ సంస్థ స్టర్మాబ్టీలంగ్ (ఎస్.ఏ) నుండి, దాని నేత ఎర్నెస్ట్ రోహ్మ్ నుండీ జర్మను సైనిక బలగాలకు ముప్పుందని భావించి, హిట్లర్ ఈ అపరేషన్ జరిపాడు. నాజీ ప్రచార యంత్రాంగం మాత్రం, రోహ్మ్ తలపెట్టిన కుట్రను ఛేదించేందుకే ఈ హత్యలు చెయ్యాల్సి వచ్చినట్లుగా చూపింది.
హిట్లర్ జరిపిన ఈ ఆపరేషన్లో ప్రధాన పాత్ర వహించింది, షుట్జ్స్టాఫెల్ (ఎస్.ఎస్), గెస్టాపో అని పిలిచే రహస్య పోలీసు సంస్థలు. ఎస్.ఎస్కు సారథి హిమ్లర్. ఈ ఏరివేతలో చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది ఎస్.ఏ కు చెందిన నేతలు. వీరిలో పేరు పొందినవాడు ఎస్.ఏ అధినేత, హిట్లరుకు అనుయాయీ అయిన రోహ్మ్. నాజీ పార్టీలోని స్ట్రాసెరిస్ట్ వర్గపు నాయకుడు గ్రెగోర్ స్ట్రాసర్తో సహా ఆ వర్గంలోని ముఖ్య నేతలను కూడా చంపేసారు. బవేరియా రాజకీయ నాయకుడు గుస్టావ్ రిట్టర్ వాన్ కార్ వంటి నాజీ వ్యతిరేకులను కూడా చంపారు. ఎస్.ఏ దౌర్జన్యాల పట్ల విసుగెత్తి ఉన్న జర్మనుల మనసు చూరగొనేందుకు కూడా ఈ హత్యలను ఉద్దేశించారు.
ఎస్.ఏ స్వతంత్రంగా వ్యవహరించడం, దాని సభ్యులు వీధి రౌడీల్లాగా ప్రవర్తించడం వంటివి తన అధికారానికి చేటు కాగలవని హిట్లరు భావించాడు. ఎస్.ఏ లోకి జర్మను మిలిటరీ - రీచ్స్వేర్ - ని విలీనం చేసి, మిలిటరీకి కూడా తానే నేతను కావాలనే ఆలోచన రోహ్మ్కు ఉందని మిలిటరీ అధికారులు భయపడేవారు. వారిని సముదాయించాలని కూడా హిట్లరు భావించాడు. దానికి తోడు, సంపదను పునఃపంపకం చేసేందుకు రెండవ విప్లవం రావాలనే నినాదానికి రోహ్మ్ బహిరంగంగా మద్దతు తెలపడం హిట్లరుకు నచ్చలేదు. 1933 జనవరి 30 న ప్రెసిడెంటు[lower-alpha 1] హిండెన్బర్గ్ హిట్లరును చాన్సలరుగా నియమించడంతో నాజీ పార్టీ అధికారానికి వచ్చినప్పటికీ, పార్టీకున్న ఇతర పెద్ద లక్ష్యాలు నెరవేరలేదని రోహ్మ్ అభిప్రాయం. తన ప్రభుత్వ విమర్శకులను, ముఖ్యంగా వైస్ చాన్సలరు ఫ్రాంజ్ వాన్ పాపెన్ అనుయాయులను, తన పాత శత్రువులనూ అంతమొందించేందుకు కూడా హిట్లరు ఈ దాడులను ఉపయోగించుకున్నాడు.[lower-alpha 2]
ఈ మారణ కాండలో కనీసం 85 మంది హతులయ్యారు. అసలు సంఖ్య వందల్లో ఉండవచ్చు.[lower-alpha 3][lower-alpha 4][lower-alpha 5] అత్యధిక అంచనాల ప్రకారం హతుల సంఖ్య 700 నుండి 1,000 దాకా ఉండి ఉండవచ్చు.[1] వ్యతిరేకులని భావించిన వాళ్ళను వెయ్యిమంది దాకా ఖైదు చేసారు.[2] ఈ కాండతో హిట్లరుకు మిలిటరీ మద్దతు బలపడింది. దీర్ఘ కృపాణ రాత్రి జర్మను ప్రభుత్వానికి ఒక మేలిమలుపు వంటిది.[3] హిట్లరును జర్మను ప్రజలకు సర్వంసహాధికారిగా నిలబెట్టింది. రీచ్స్టాగ్లో జూలై 13 న చేసిన ప్రసంగంలో హిట్లరు ఈ సంగతే చెప్పాడు.
ఈ మారణకాండను అమలు జరిపే ముందు, వ్యూహకర్తలు ఈ పథకాన్ని కోలిబ్రి (హమ్మింగ్బర్డ్) అనే సంకేత నామంతో పిలిచేవారు.[4] దీర్ఘ కృపాణ రాత్రి (నఖ్ట్ డెర్ లాంగెన్ మెస్సర్) అనే పేరు మాత్రం జర్మను భాషలో ఈ హత్యలకు ముందే వాడుకలో ఉంది. ప్రతీకార సంఘటనలను ఈ పేరుతో వ్యవహరించేవారు.