ఇండోనేషియాలో హిందూమతం
From Wikipedia, the free encyclopedia
ఇండోనేషియా లోని ఆరు అధికారిక మతాలలో హిందూ మతం ఒకటి. [1] 2018 ఇండోనేషియా జనాభా లెక్కల ప్రకారం, మొత్తం జనాభాలో 1.74% మంది, బాలిలో దాదాపు 87% మంది హిందువులు. [2] 1వ శతాబ్దంలో వ్యాపారులు, నావికులు, పండితులు, పూజారుల ద్వారా హిందూమతం ఇండోనేషియాకు వచ్చింది. [3] ముందునుండీ అక్కడ ఉన్న జావానీయ జానపద మతం, సంస్కృతినీ, 6వ శతాబ్దం నుండి బౌద్ధ ఆలోచనలనూ కూడా సంశ్లేషణ చేసుకుని, హిందూమతపు ఇండోనేషియా శాఖగా పరిణామం చెందింది. [4] ఈ ఆలోచనలు శ్రీవిజయ, మజాపహిత్ సామ్రాజ్యాల కాలంలో అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. [5] సుమారు సా.శ. 1400 లో, ఈ రాజ్యాల లోకి తీరప్రాంత ముస్లిం వ్యాపారుల ద్వారా ఇస్లాంకు పరిచయమైంది. ఆ తర్వాత హిందూమతం చాలావరకు ఇండోనేషియాలోని అనేక ద్వీపాల నుండి అదృశ్యమైంది. [6] [7]
2010లో, ఇండోనేషియా ప్రభుత్వ మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇండోనేషియా దీవులలో సుమారు కోటి మంది హిందువులు నివసిస్తున్నారని అంచనా వేసింది. [8] 2010 ఇండోనేషియా అధికారిక దశాబ్దిక జనగణనలో ఇది 40 లక్షలుగా ఉంది. [2] [9] భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్ ల తర్వాత హిందువుల జనాభాలో ఇండోనేషియా నాల్గవ స్థానంలో ఉంది. [10] పరిసద హిందూ ధర్మ ఇండోనేషియా దశాబ్ధ జనాభా గణన పద్ధతిలో లోపముందని ప్రకటించింది. 2005లో ఇండోనేషియాలో 1.8 కోట్ల మంది హిందువులు నివసించారని అంచనా వేశారు. [11] [12] మైనారిటీ మతం అయినప్పటికీ, హిందూ సంస్కృతి ఇండోనేషియాలో జీవన విధానాన్నీ రోజువారీ కార్యకలాపాలనూ ప్రభావితం చేసింది. [13] అధికారిక గుర్తింపు పొందేందుకు బాలి వెలుపలి ప్రాంతాల్లో ఉన్న అనేక మంది సాంప్రదాయిక స్వదేశీ మతాలను అనుసరించేవారు తమను హిందువులుగా చెప్పుకుంటారు.
ఇండోనేషియా ద్వీపసమూహంలోని స్థానికులు ఆస్ట్రోనేషియన్ ప్రజల లాగానే స్వదేశీ యానిమిజం, డైనమిజం లను పాటించేవారు. వాళ్ళు పూర్వీకుల ఆత్మలను పూజిస్తారు. కొన్ని ఆత్మలు పెద్ద చెట్లు, రాళ్ళు, అడవులు, పర్వతాలు లేదా ఏదైనా పవిత్ర స్థలం వంటి ప్రదేశాలలో నివసిస్తాయని కూడా వారు విశ్వసిస్తారు. [14] అతీంద్రియ శక్తి ఉండే ఈ కనిపించని ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని పురాతన జావానీయ, సుండానీస్, బాలినీయ "హ్యాంగ్" గా భావిస్తారు. దీనికి దైవిక లేదా పూర్వీకులు అని అర్థం. ఆధునిక ఇండోనేషియాలో, "హ్యాంగ్" అంటే దేవునితో సంబంధం కలిగినదని అర్థం. [15] [16]