ఆదర్శ వనితలు
From Wikipedia, the free encyclopedia
"యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" అన్నారు పెద్దలు. ఆడవాళ్ళకు గౌరవం ఉన్నచోట దేవతలు విహరిస్తారు అని దీని అర్థం.
వేద కాలం నాడు మహిళకే అగ్రస్థానం. ఇంటి పెత్తనం ఆమెది. అన్ని విషయాలలో ఆమె మాటే వేదం. ఆనాడు పురుషులతో సమంగా చదువుకున్న వారూ ఉన్నారు. శాస్త్ర విషయాలు వాదించి నెగ్గినవారూ ఉన్నారు.
మధ్యలో కొన్ని మూఢ నమ్మకాలు, చాదస్తాలు వారి స్థానాన్ని కిందికి దించాయి. ఆడవారికి చదువుకోవడం తగదన్నారు. ఇంకా ఎన్నో నిర్బంధాలు. ఈ విధంగా సంకెళ్ళలో చిక్కుకున్న అతివ అబల అన్నారు. ఆడవాళ్ళు అంటే ఇంట్లో వంట చేయడం వరకే అని హద్దులు గీచారు. దీని ఫలితంగా ఆడవాళ్ళు వంటింటికే పరిమితమైయ్యారు. అనేకమైన దురాచారాలకు బలిపశువులయ్యారు. కొన్నాళ్ళు కన్యాశుల్కం సమస్య పీడించింది. వరకట్నం యిబ్బంది పెడుతోంది. అయితే క్రమంగా మళ్ళీ ఆడవాళ్ళు అన్నిట్లో రాణిస్తున్నారు. ఆంక్షల సంకెళ్ళు తెంచుకొని అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారు.
దేశానికి ప్రధానమంత్రులయ్యారు, అవుతున్నారు.దేశాధ్యక్షులవుతున్నారు. అంతరిక్షానికి వెళ్తున్నారు. ఒకప్పుడు కేవలం మగవాళ్ళే చేయదగ్గ పనులన్నింటినీ ఈనాడు ఆడవాళ్ళు చేస్తున్నారు. ఎన్నో రంగాలలో ఆడవాళ్ళు మరింత ముందుకు సాగుతున్నారు. ఈ ప్రగతిని చూసే ఒక సినిమా కవి - " లేచింది మహిళా లోకం - నిద్ర చేచింది మహిళా లోకం - దద్దరిల్లింది పురుష ప్రపంచం" అన్నాడు. అంతకు ముందే ఇంకో పాత కవి "ముదితల్ నేర్వగరాని విద్య కలదే? ముద్దార నేర్పించినన్" అన్నాడు.
అటువంటి మహిళలను అంతా మెచ్చుకోవలసిందే, ఆచరించవలసినదే. అటువంటి మెచ్చుకోతగ్గ మహిళలు కొంతమందిని ఈ దిగువనుదహరించటం జరిగింది.
ఈ మహిళల చరిత్రలు మరింతమందికి మరింత ప్రేరణ కలిగిస్తాయి అనుటలో సందేహం లేదు.ముఖ్యంగా మహిళలు మరింత ఉత్తేజాన్ని పొందాలి. అప్పుడే తల్లి ఋణం తీర్చుకున్న తృప్తి కలుగుతుంది. ఈ ఆదర్శ మహిళలను ఆదర్శంగా తీసుకుని ప్రతిఒక్కరు విజయపథం వైపు పయనించాలి.ఆడవాళ్ళు చదువుకుంటే ఎన్ని అధ్బుతాలు చేయవచ్చు.! మగవాడి చదువు అతనికే పరిమితం కానీ ఆడవాళ్ళ చదువు ఇంటింటి వెలుగు!